ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

  • ఇటీవల రాఘవ్ చద్దా స్థానంలో రాజ్యసభ ఉపనాయకుడిగా నియామకం
  • అశోక్ కుమార్ మిట్టల్ నియామకం జరిగిన కొన్ని రోజులకే ఈడీ సోదాలు
  • ఈడీ సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. జలంధర్ కంటోన్మెంట్‌లోని 16, ది మాల్ రోడ్‌లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రాఘవ్ చద్దా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఉపనాయకుడిగా మిట్టల్‌ను నియమించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి మిట్టల్ నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాలపై త్వరలో ప్రకటన ఉంటుందని అన్నారు. అశోక్ కుమార్ మిట్టల్ వ్యాపారవేత్త, విద్యావేత్త. లవ్లీ గ్రూప్‌నకు అధిపతిగా ఉన్నారు. ఆయనకు చెందిన గ్రూప్ ఒక యూనివర్సిటీని కూడా నిర్వహిస్తోంది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తడానికి తమ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా భయపడుతున్నారనే కారణంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను పార్టీ ఉపనేత స్థానం నుంచి తొలగించింది. ఈడీ సోదాలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. బీజేపీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిందని, అందుకే తమ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసం, విశ్వవిద్యాలయం, కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

Ashok Kumar Mittal
AAP
Aam Aadmi Party
ED Raid
Enforcement Directorate
Punjab
Bhagwant Mann

More Telugu News